చికెన్ కర్రీ
చికెన్ కర్రీ అనేది చాలా మంది ఇష్టపడే ప్రియమైన ఇంకా రుచికరమైన వంటకం.మాంసాహారంలో ఇది చాలా ప్రసిద్ది చెందింది,ఈ వంటకం- రైస్, చపాతి,పూరీ కలయికలో చాలా బాగుంటుంది.ఈ కలయికలో “పరోటా మరియు చికెన్ కర్రీ” – అత్యుత్తమ వంటకం. చికెన్ కర్రీని మనం చాలా విధాలుగా చేయవచ్చు, కొబ్బరి లేకుండా చికెన్ కర్రీని తయారుచేసే పద్ధతి ఇది. వేయించిన టమాట,ఉల్లిపాయల గ్రైండ్ చేసిన మసాలా ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని మరియు చిక్కదనాన్ని ఇస్తుంది.
కావలసిన పదార్థాలు:-
- చికెన్ : అర కేజీ
- తరిగిన ఉల్లిపాయ : 3 కప్పులు
- తరిగిన టమోటా : 2 కప్పులు
- తరిగిన కొత్తిమీర : 1 కప్పు
- జీలకర్ర : 1 టీస్పూన్
- కారం : 1 టేబుల్ స్పూన్
- పసుపు : అర టీస్పూన్
- నూనె : 3 టేబుల్ స్పూన్
- ఉప్పు : తగినంత
- ధనియాల పొడి :రెండు స్పూన్లు
- నీరు : ఒక కప్పు
- గరం మాసాల : ఒక టీ స్పూన్
- పెరుగు : ఒక కప్పు
- పచ్చి మిర్చి : నాలుగు
- తరిగిన పుదీనా :అరకప్పు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
- నిమ్మరసం :1 టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం:-
1
ముందుగా చికెన్ తీసుకొని శుభ్రం చేసి, దానిలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మాసాల, ధనియా పొడి, పుదీన, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక గంటసేపు మారినేట్ చేసి పెట్టుకోవాలి.
2
ఒక కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి వేడి అయినా తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి, కొంచెం వేగాక టమాట ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత చల్లార్చాలి.
3
చల్లబడిన మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4
ఇపుడు అదే కడాయిలో మిగిలిన నూనె వేసి వేడయ్యాక జీలకర్ర,తరిగిన పచ్చిమిర్చి వేయాలి .అవి వేగాక పసుపు వేసి,గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి మూతపెట్టి చిన్న మంట పై ఐదు నిముషాల పాటు ఉడకనివ్వాలి.
5
తరువాత మారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలిపి పదినిముషాలు ఉడికించాలి.
6
ఇపుడు కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి సుమారు ఇరవై నిమిషాలపాటు ముక్క మెత్తగా ఉడికేవరకూ ఉంచాలి. చివరగా గరం మసాలా వేసి కలిపి దించి కొత్తిమీరతో అలంకరించాలి.