వర్షాకాలంతో పాటు వచ్చే మొక్కజొన్న పొత్తుని తిననివారుండరు. చిరు జల్లులు పడుతుంటే వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. అలాగే వాటితో చేసే గారెలు కూడా చాలా రుచిగా ఉండటమే కాకుండా, ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ మొక్కజొన్న గారెలకి ప్రత్యేక స్థానం ఉంది. వీటిని మక్కా గారెలు అని కూడా పిలుస్తారు.
వింటే భారతం వినాలి. తింటే గారేలే తినాలి అని పెద్దలు ఏ క్షణంలో అన్నారో కానీ గారెలు ఎలా చేసినా వాటి రుచి వేరు, అందులోనూ మొక్కజొన్నతో చేసిన గారెలు వద్దంటున్నా, తింటూనే ఉంటారు. మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో b6,b9,ఫోలిక్ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉంటాయి. మరి అంతటి ఆరోగ్యకరమైన, రుచికరమైన మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూద్దాం ….
కావలసిన పదార్థాలు:-
- మొక్కజొన్న గింజలు : 2 కప్పులు
- జీలకర్ర : 1 టేబుల్ స్పూన్
- పచ్చి మిర్చి : 6
- తరిగిన కొత్తిమీర : అర కప్పు
- పుదీనా : అర కప్పు
- కరివేపాకు : అర కప్పు
- వెల్లుల్లి రెబ్బలు : 10
- అల్లం : చిన్న ముక్క
- ఉప్పు : తగినంత
- నూనె : వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:-
1
ముందుగా మిక్సీజార్ లో మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి,కొత్తిమీర,పుదీనా,వెల్లుల్లి రెబ్బలు,అల్లం ముక్క,జీలకర్ర,కరివేపాకు,ఉప్పు వేసి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోవాలి.
2
పిండి జారుగా కాకుండా చూసుకోవాలి. నీరు కలపకూడదు.ఒక వేళ మొక్కజొన్న లేతగా ఉండి జారుగా అయినట్లయితే కొంచెం బియ్యపు పిండి లేదా శనగపిండి వేసి కలుపుకోవచ్చు.
3
తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, గారెల్లా ఒత్తుకుని నూనెలో వేసి,మీడియం మంటపై, బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన మొక్కజొన్న గారెలు రెడీ. వీటిని టమాట సాస్ తో తింటే చాలా రుచికరంగా ఉంటాయి.